కలం, వెబ్ డెస్క్ : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పాలనపై బీజేపీ (BJP) ఛార్జ్ షీట్ (Charge Sheet) విడుదల చేసింది. హైదరాబాద్ లోని హోటల్ పీపుల్స్ ప్లాజాలో ఆపార్టీ తెలంగాణ చీఫ్ రామచందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ఇన్ ఛార్జ్ ఆశిష్ సెలార్ ఛార్జ్ షీట్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్, పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామచందర్ రావు (Ramchander Rao) మాట్లాడుతూ.. కాంగ్రెస్ బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాలు, సేవ్ తెలంగాణ, ఓట్ బీజేపీ (Save Telangana, Vote BJP) థీమ్ తో ఛార్జ్ షీట్ విడుదల చేసినట్లు తెలిపారు. గ్యారంటీల పేరుతో ఓట్లు దండుకున్న కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉండటం దురదృష్టకరమన్నారు. ఉస్మానియాకు రూ. 1000 కోట్లు ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పటి వరకు నయా పైసా ఇవ్వలేదని విమర్శించారు.
‘ఆరోగ్య శ్రీ కింద వేల కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్రంలో విద్య, వైద్యం పూర్తిగా కుంటుపడ్డాయి. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దనాలల్లో ఏ ఒక్క వాగ్దానం సంపూర్ణంగా అమలు కాలేదు. కేంద్ర పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయి. లక్షల మంది కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్నారు. షో చేయడం తప్ప.. రాష్ట్రంలో ఒక్క ఇందిరమ్మ ఇళ్లు లేదు.
ఓట్ల కలెక్షన్ల కోసమే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించారు. మున్సిపాలిటీలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేంటో చెప్పాలి. 7 మున్సిపల్ కార్పొరేషన్లలో టాక్సీల పేరు మీద భారీ కుంభకోణం జరుగుతుంది’ అని ఆరోపించారు.
మున్సిపాలిటీలకు వచ్చే నిధుల్లో ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వానివేనని రామచందర్ రావు చెప్పారు. రాష్ట్రంలో క్రైమ్ విపరీతంగా పెరిగిపోయిందని.. శాంతి భద్రతలు విఫలమయ్యాయని విమర్శించారు. తెలంగాణ డ్రగ్స్ కు కేంద్రంగా మారిపోయిందన్నారు. హిందూ దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయని.. దేవాలయాల భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్, కాంట్రాక్ట్, కరప్షన్ ప్రభుత్వం అని విమర్శించారు. ‘మా ఫోన్లు ట్యాపింగ్ చేసి, మా మీదనే కేసులు పెట్టారు’ అని ధ్వజమెత్తారు. పోన్ ట్యాపింగ్ చేయవలసిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. మొదటగా బీజేపీ నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆయన ఆరోపించారరు. సేవ్ తెలంగాణ – ఓట్ బీజేపీ నినాదంతో ప్రజల ముందుకు వెళ్తామని.. ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని రామచందర్ రావు విజ్ఞప్తి చేశారు.

Read Also: మూగ, చెవిటి, అంధ స్టూడెంట్లపై వార్డెన్ లైంగిక వేధింపులు
Follow Us On: Instagram


