కలం, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్పై విపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ (BJP) కౌంటర్ స్ట్రాటెజీ సిద్ధం చేసింది. సాధారణ ప్రజానీకంలో సైతం ఎలాంటి వరాల్లేవనే మాటలు వినిపిస్తున్నాయి. అసలే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రభావం ఓటింగ్పై పడకుండా వ్యూహ రచనకు రెడీ అవుతున్నది. అందులో భాగంగానే బీజేపీ పార్లమెంటరీ పార్టీ (Parliamentary Party Meeting) మీటింగ్ను ఏర్పాటు చేసింది. పార్లమెంటు లైబ్రరీ భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో మంగళవారం ఉదయం 9.30 గంటలకు జరిగే ఈ సమావేశానికి ఎంపీలంతా రావాల్సిందిగా పార్టీ సెక్రటరీ శివశక్తినాధ్ ఒక సర్క్యులర్లో పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభం కావడానికి ముందే ఆ పార్టీతో సహా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీలతో ప్రధాని (PM Modi) స్పష్టమైన మెసేజ్ ఇవ్వనున్నారు. బడ్జెట్లోని అంశాలను జనంలోకి తీసుకెళ్ళాలని సూచించనున్నారు.
ఈ సమావేశానికి (BJP Parliamentary Meeting) సంబంధించి నిర్దిష్టమైన ఎజెండాను బీజేపీ వెల్లడించకపోయినప్పటికీ కొద్దిమంది ఎంపీలకు మౌఖికంగా వివరాలు వెళ్ళాయి. బడ్జెట్పై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని క్లియర్ చేయాలని, ఇందులో మహాత్మాగాంధీ (Mahathma Gandhi) గ్రామ్ స్వరాజ్ ఇనిషియేటివ్ అనే కొత్త స్కీమ్ గురించి వివరించాలని, ఖాదీ రంగానికి సంబంధించిన అంశాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్ళాలన్నది బీజేపీ భావన. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించడంపై దేశవ్యాప్తంగా వివిధ పార్టీలు సహా కొన్ని స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో కొత్త పథకానికి ఆ పేరు పెట్టిన అంశంతో క్లారిటీ ఇవ్వాలని భావిస్తున్నది. దీనికి తోడు సెమీ కండక్టర్, చిప్ సహా పలు ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించడానికి రసూ. 40 వేల కోట్లను బడ్జెట్లో పెట్టామన్న అంశాన్ని కూడా ప్రజల దగ్గరకు తీసుకెళ్లాలనుకుంటున్నది.
పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వందేమాతరం (Vandemataram) గీతానికి 150 ఏండ్లయిన సందర్భాన్ని పార్టీపరంగా వినియోగించుకోవాలన్న అంశాన్ని కూడా ప్రధాని ఈ సమావేశంలో ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఆ రాష్ట్రంలో వరుసగా మూడు టర్ముల నుంచి తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఈసారి బీజేపీ కైవశం చేసుకోవాలని భావిస్తున్నది. దీంతో బెంగాల్ సెంటిమెంట్ను విస్తృతంగా వాడుకోవడంలో భాగంగా వందేమాతరం అంశాన్ని టేకప్ చేసే ప్లాన్ను వివరించే అవకాశమున్నది. మరోవైపు ‘రేర్ ఎర్త్’ (Rare Earth) మెటల్స్ వెలికితీత, ఆధునిక టెక్నాలజీలో వీటి వినియోగం కోసం ఆ పరిశ్రమలను తమిళనాడు, కేరళ, ఏపీ రాష్ట్రాల్లో నెలకొల్పే అంశాన్ని కూడా జనంలోకి తీసుకెళ్ళాలని ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని దిశానిర్దేశం చేయనున్నట్లు బీజేపీ ఎంపీల సమాచారం.
Read Also: కేసీఆర్ సిట్ విచారణపై కవిత కీలక వ్యాఖ్యలు
Follow Us On: Sharechat


