కలం, వెబ్ డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసంలో సిట్ అధికారుల విచారణ గంటల తరబడి కొనసాగుతోంది. నందినగర్లోని ఆయన నివాసంలో రెండో అంతస్తులో గత మూడు గంటలకు పైగా ఈ విచారణ ప్రక్రియ నాన్స్టాప్గా సాగుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేసీఆర్ (KCR) స్టేట్ మెంట్ ను సిట్ అధికారులు రికార్డు చేస్తున్నారు. అయితే సిట్ అధికారులు కేసీఆర్ను ఏయే అంశాలపై ప్రశ్నిస్తున్నారు, ఆయన ఎలాంటి సమాధానాలు ఇస్తున్నారు అనే విషయంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఈ విచారణ నేపథ్యంలో కేసీఆర్ (KCR) నివాసం, తెలంగాణ భవన్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ నేతను విచారించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రోడ్లపై బైఠాయించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
తెలంగాణ భవన్ నుంచి ముట్టడికి బయల్దేరిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఆందోళనకారులను నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండటంతో నందినగర్ ప్రాంతమంతా ప్రస్తుతం నిరసనలతో హోరెత్తుతోంది. విచారణ ఇంకా కొనసాగుతుండటంతో అధికారులు తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే ఉత్కంఠ కొనసాగుతోంది.
Read Also: హిందువులపై దాడుల ఎఫెక్ట్.. బంగ్లాదేశ్కు సాయంలో కోత
Follow Us On: X(Twitter)


