కలం, వెబ్డెస్క్: మహారాష్ట్రలోని బారామతి విమానాశ్రయంలో ఈరోజు ఉదయం లీయర్జెట్–45 ఎయిర్క్రాఫ్ట్ కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) తోపాటు ఆ ఫ్లైట్లోని మరో నలుగురు దుర్మరణం చెందారు. ఈ క్రమంలో ప్రమాదానికి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) ఒక ప్రకటన విడుదల చేసింది. లీయర్జెట్–45, పైలెట్ల అనుభవం, ల్యాండింగ్ సమయంలో ఎదురైన సమస్యల గురించి వివరించింది. దీని ప్రకారం..
లీయర్జెట్–45 విమానం ఉదయం 8గంటల 18 నిమిషాలకు బారామతి ఎయిర్పోర్ట్లోని ఎయిర్ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)ని పైలెట్లు సంప్రదించారు. వాతావరణం బాగానే ఉందని, గాలివేగం పెద్ద సమస్యగా లేదని సమాచారమిచ్చారు. రన్వే 11పై ల్యాండింగ్కు ప్రయత్నించారు. తీరా ల్యాండింగ్ సమయంలో పైలెట్లకు రన్వే స్పష్టంగా కనిపించలేదు. దీంతో వాళ్లు ‘గో–అరౌండ్’ పద్ధతిలో.. ల్యాండ్ చేయకుండా మళ్లీ గాలిలోకి లేచి, మరోసారి ప్రయత్నించారు.
ఈ క్రమంలో మొదట రన్వే కనిపించడం లేదని ఏటీసీకి సమాచారమిచ్చారు. కొన్ని సెకండ్ల తర్వాత కనిపించిందంటూ చెప్పారు. అయితే, ల్యాండింగ్ చేస్తున్నారా? లేదా అనే విషయాన్ని వాళ్లు ఏటీసీకి ధ్రువీకరించలేదు. అనంతరం 8.44నిమిషాలకు రన్వే దగ్గర విమానం మంటల్లో చిక్కుకున్నట్లు తెలిసింది. అత్యవసర సేవలు అక్కడికి చేరుకున్నాయి. రన్వే11కి ఎడమవైపు పూర్తిగా దెబ్బతిన్న స్థితిలో విమాన శకలాలు కనిపించాయి. అంతేకాదు, అందులో ప్రయాణిస్తున్న డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) తోపాటు, మరో నలుగురు దుర్మరణం చెందారు.
ఇదే విషయాన్ని ప్రకటనలో పేర్కొన్న డీజీసీఏ ఫ్లైట్కు సంబంధించి అన్ని సర్టిఫికెట్లు సక్రమంగానే ఉన్నాయని చెప్పింది. అంతేకాదు, పైలెట్లకు 15వేల గంటలకు పైగా ఫ్లయింగ్ అనుభవం ఉన్నట్లు తెలిపింది. విజిబిలిటీ సరిగా లేకపోవడం వల్లే.. అంటే పైలెట్లకు రన్వే సరిగా కనిపించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని వెల్లడించింది.
కాగా, ప్రమాదం విషయం తెలిసిన వెంటనే విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ (AAIB) డీజీ నేరుగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫ్లైట్ డేటా, వాతావరణం, కమ్యూనికేషన్, మానవ తప్పిదం తదితర అన్ని కోణాల్లో జరుపుతున్నారు. అయితే, తుది నివేదిక వచ్చేవరకు ప్రమాదానికి కచ్చితమైన కారణం వెల్లడించలేమని అధికారులు అంటున్నారు.
Read Also: అజిత్ మృతిపై శరద్ పవార్ రియాక్షన్ ఇదే
Follow Us On: Pinterest


