కలం, వెబ్ డెస్క్ : న్యూజిలాండ్ (New Zealand) తో జరిగే టీ20 సిరీస్లో సంజూ శాంసన్ (Sanju Samson) పై ఒత్తిడి పెరుగుతున్న వేళ.. అతడికి మరో అవకాశం దక్కే సంకేతాలు కనిపిస్తున్నాయి. గోల్డెన్ డక్ సహా వరుస వైఫల్యాల మధ్య సంజూ స్థానం హాట్ టాపిక్గా మారింది. మూడో టీ20లో ఖాతా తెరవకుండానే వెనుదిరిగిన సంజూ ప్రదర్శనపై తీవ్ర చర్చ జరిగింది. శుభ్మన్ గిల్ (Shubman Gill) స్థానంలో తిరిగి వచ్చినా పరుగులు రాకపోవడంతో ప్లేయింగ్ ఎలెవన్లో అతడి స్థానం కదిలే పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో ఇషాన్ కిషన్ బ్యాట్తో ఆకట్టుకోవడం పోటీని మరింత కఠినం చేసింది.
ఈ పరిణామాలపై స్పందించిన ఆకాశ్ చోప్రా (Aakash Chopra).. తిలక్ వర్మ పూర్తిగా కోలుకోకపోవడంతో చివరి రెండు టీ20లకు దూరమయ్యే అవకాశముందని తెలిపారు. ఈ పరిణామం సంజూకి లాభంగా మారుతుందని చెప్పారు. దీంతో సంజూ మరో రెండు మ్యాచ్లు ఆడే అవకాశం పొందుతాడని పేర్కొన్నారు. అందులో ఒక మ్యాచ్ అతడి స్వస్థలం తిరువనంతపురంలో జరగనుందని, ఆసియా కప్ సమయంలో బ్యాటింగ్ క్రమంలో మార్పులు జరగకపోయి ఉంటే సంజూపై (Sanju Samson) ఇంత ఒత్తిడి ఉండేది కాదని చోప్రా అభిప్రాయపడ్డారు. ఓపెనర్గా కొనసాగితే అతడి ఫామ్ అప్పుడే తేలిపోయేదని చెప్పారు. ఇప్పుడు లభిస్తున్న అదనపు మ్యాచ్లు సంజూకి కీలకమని తెలిపారు.
అయితే అవకాశాల విషయంలో సంజూపై అన్యాయం జరగలేదని చోప్రా స్పష్టం చేశారు. ప్రతిభ ఉన్నప్పటికీ ఫామ్ కోల్పోతే వరుసగా తక్కువ స్కోర్లకే అవుట్ కావడం అతడి సమస్యగా మారుతుందని చెప్పారు. ఇప్పటికే సిరీస్ను భారత్ ఖరారు చేసుకోగా విశాఖపట్నం, తిరువనంతపురంలో జరగనున్న చివరి రెండు మ్యాచ్లు.. సంజూ శాంసన్ భవిష్యత్తుపై స్పష్టత తీసుకువచ్చే అవకాశముంది.
Read Also: ప్రొఫెషనల్ క్రికెట్కు కేన్ రిచర్డ్సన్ వీడ్కోలు
Follow Us On: Sharechat


