కలం, వెబ్ డెస్క్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కంటే తెలంగాణ వచ్చాక సింగరేణి ఎక్కువ దోపిడీకి గురైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) అన్నారు. నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ పాలకులు సింగరేణిని దోచుకున్నారని చెప్పారు. గతంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే సింగరేణిని దోచుకు తింటే, నేడు కాంగ్రెస్ పాలనలో మంత్రులు, దళారులు విచ్చలవిడిగా దోచుకు తింటున్నారని దుయ్యబట్టారు. సింగరేణిలో దోచుకున్న సొమ్ముతోనే బీఆర్ఎస్ పార్టీ నడుస్తోందని ఆరోపించారు. నైనీ బొగ్గు గనుల టెండర్ ప్రక్రియ సహా 2014 నుండి నేటి వరకు సింగరేణిలో జరిగిన అక్రమాలు, దోపిడీకి సంబంధించిన రికార్డులన్నీ తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆ రికార్డులను తారుమారు చేసే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈరోజు కోర్టు కేసుల విచారణకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కొద్దిసేపు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు.
ఈ సందర్బంగా ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు గణేశ్ తదితరులతో కలిసి విలేకరులతో ఇష్టాగోష్టిగా ముచ్చటించారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం, నేడు కాంగ్రెస్ పాలనలో మంత్రులు, దళారులు సింగరేణిని దోచుకుంటున్నది వాస్తవమేనన్నారు. కాంగ్రెస్ అవినీతిపై హరీష్ రావు లేఖ రాస్తే… బీఆర్ఎస్ అవినీతిపై కూడా విచారణ జరుపుదామా? అని మంత్రి భట్టి చెబుతూ టైంపాస్ చేసుకుంటున్నారే తప్ప విచారణ మాత్రం జరపడం లేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 2014 నుండి ఇప్పటి వరకు సింగరేణిలో గనుల కేటాయింపు, జరిగిన దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేయాలని బండి (Bandi Sanjay Kumar) డిమాండ్ చేశారు.
తెలంగాణలో జరిగిన దోపిడిపై మాట్లాడుతుంటే.. గుజరాత్ గురించి మాట్లాడుతున్నారు..
తాము తెలంగాణలో జరిగిన దోపిడీపై మాట్లాడుతుంటే… ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకు గుజరాత్ గురించి మాట్లాడుతూ పసలేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ‘‘సింగరేణి కార్మికులు పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకుంటే… ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువ గనుల దోపిడీ ఇప్పుడు కొనసాగుతోంది. కేసీఆర్ పాలనలో సింగరేణిలో దోచుకున్న సొమ్ముతోనే బీఆర్ఎస్ పార్టీని ఇన్నాళ్లు నడిపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకుల పుణ్యమా? అని రూ.42 వేల కోట్ల సింగరేణి సొమ్మును దారి మళ్లించి ఆ సంస్థను నష్టాల్లోకి నెట్టారు. జీతాల కోసం బ్యాంకుల వద్ద ఓడీ తెచ్చుకునే దుస్థితి కల్పించారు.
ఎన్నికలకు ముందు సింగరేణిని లాభాల్లోకి తెస్తామంటారు…. అధికారంలోకి వచ్చాక ఆ సొమ్మునంతా దారి మళ్లించడం ఈ రెండు పార్టీలకు పరిపాటైంది. సింగరేణి ప్రజలు, కార్మికులు రెండు పార్టీల తీరును చూసి అసహ్యించుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ తోడు దొంగలే’’అని దుయ్యబట్టారు. వారం రోజుల తరువాత సింగరేణి భాగోతాన్ని దారి మళ్లించేందుకు మరో అంశాన్ని ఈ రెండు పార్టీలు తెరపైకి తెస్తారని, ప్రజలు ఈ పార్టీల వ్యవహారాన్ని గమనిస్తున్నారని చెప్పారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మేయర్, మున్సిపల్ ఛైర్మన్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.
కేటీఆర్, కేసీఆర్ లకు కాంగ్రెస్ ప్రభుత్వం క్లీన్ చిట్ ఇస్తోందా?
‘‘ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ను సాక్షిగా పిలిచామని మంత్రులు చెబుతుంటే విచారణకు పిలిచామని సజ్జనార్ చెబుతున్నారు. ఏది నిజం? ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, కేసీఆర్ లకు కాంగ్రెస్ ప్రభుత్వం క్లీన్ చిట్ ఇస్తోందా? కేటీఆర్, హరీష్ సహా అందరినీ సాక్షిగా పిలిస్తే… అసలు ఫోన్ ట్యాపింగ్ దోషులెవరు? ఫోన్ ట్యాపింగ్ దొంగలను సాక్షులుగా పిలవడమేంటి?’’అని ప్రశ్నించారు. సిట్ విచారణను ప్రత్యక్షంగా, పరోక్షంగా మంత్రులు ప్రభావితం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా సిట్ అధికారులకు నిజాయితీ, నిబద్దతతో విచారణ జరిపే స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు.
ప్రభుత్వ ఒత్తిడికి లొంగి విచారణ చేస్తే సిట్ అధికారులకు ఉన్న క్రెడిబిలిటీ పోతుందని చెప్పారు. అధికారంలో ఉన్నంత కాలం ప్రజల సొమ్మును దోచుకుని అరాచకాలకు పాల్పడ్డ కేసీఆర్ కుటుంబానికి అన్నీ లొట్టపీసు కేసుల్లాగే కన్పిస్తాయని ఎద్దేవా చేశారు. ఎన్ని అరాచకాలు, అవినీతి చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదనే ధీమా కేసీఆర్ కుటుంబంలో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని అన్నారు.
‘‘నా ఫోన్ ట్యాప్ అయ్యిందని విచారణకు పిలిచి.. మావోయిస్టు జాబితాలో నా పేరును చేర్చారని చెప్పారు. మరి అందుకు కారకులైన వారిపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? కాంగ్రెస్ స్కాంలు బయటపడుతున్నప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్ కేసుతో డ్రామాలాడుతున్నారు. కేటీఆర్ పెద్ద సంసారి అయినట్లు మాట్లాడుతున్నారు. ఎన్ని కుటుంబాలను, ఎంత మంది జీవితాలను నాశనం చేశారో తెలియదా? నిజాం అరాచకాలను మరువలేదు… కేటీఆర్ చేసిన అరాచకాలను కూడా మర్చిపోలేం. కేటీఆర్ లో ఇంకా అహంకారం తగ్గలేదు’’అని అన్నారు.
సింగరేణిపై ఆరోపణలు, ప్రత్యారోపణలతో టైంపాస్ చేయకుండా తక్షణమే సింగరేణి అవకతవకలకు సంబంధించిన రికార్డులన్నీ వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆలస్యమయ్యే కొద్ది ఆ రికార్డులన్నీ తారుమారు చేసే ప్రమాదముందని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సింగరేణికి చెల్లించాల్పిన రూ.42 వేల కోట్లు తక్షణమే ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Read Also: నుమాయిష్ ఎగ్జిబిషన్ కు ఎవరూ రావొద్దు : సీపీ సజ్జనార్
Follow Us On : WhatsApp


