కలం, వెబ్ డెస్క్: మేడారం జాతరకు (Medaram Jatara) వెళ్లే భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 51 ముఖ్య కేంద్రాల నుంచి 4,000కు పైగా బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది. 2024లో 3,491 ప్రత్యేక బస్సులతో 16.82 లక్షల మంది యాత్రికులు మేడారం జాతరకు చేరుకున్నారు. ఈసారి మహాలక్ష్మి స్కీం (Mahalakshmi Scheme) కింద మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్న నేపథ్యంలో సుమారు 20 లక్షల మంది యాత్రికులు బస్సుల ద్వారా మేడారానికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
అధికారికంగా జనవవరి 28వ తేదీ నుంచి 31 వరకు మేడారం మహా జాతర జరుగనుంది. కానీ, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని జనవరి 25 నుంచి నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఆర్టీసీ సేవలు కొనసాగనున్నాయి. మేడారం వద్ద 50 ఎకరాల్లో తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. 50 క్యూలైన్ల ద్వారా 20,000 మందికి ఒకేసారి బస్సుల్లో ఎక్కే సౌకర్యం లభిస్తుంది. తాత్కాలిక స్టేషన్లో 1.10 లక్షల చదరపు అడుగుల వేటింగ్ ఏరియా, సిబ్బంది విశ్రాంతి గదులు, బస్సుల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొత్తం 25.76 ఎకరాల్లో బస్సు పార్కింగ్ ఏర్పాట్లు ఉన్నాయి. మైనర్ మెయింటెనెన్స్ కోసం 13 జీడీ ట్రక్లు, 2 క్రేన్లు, 1 ట్రాక్టర్ను అమర్చారు. మార్గంలో 7 ప్రైవేట్ పెట్రోల్ బంక్లలో హెచ్ఎస్డీ ఇంధనాన్ని టాప్ అప్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. 10,441 మంది సిబ్బంది, 7,000 డ్రైవర్లు, 1,811 కండక్టర్లు, 759 సెక్యూరిటీ సిబ్బంది, ఇతర మెయింటెనెన్స్ సిబ్బంది, అధికారులు మానిటరింగ్ కోసం సిద్దంగా ఉంటారు.
మేడారం రూట్లలో ప్రైవేటు వాహనాల తనిఖీల కోసం 12 జీపులు, 8 మోటార్ సైకిళ్లు పెట్రోలింగ్ నిర్వహిస్తాయి. హన్మకొండ నుంచి తాడ్వాయి వరకు కీలక ప్రాంతాల్లో గార్డులను ఏర్పాటు చేశారు. మేడారం బస్ స్టేషన్లో 76 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ట్రాఫిక్ను పర్యవేక్షిస్తారు. తాగునీరు, టాయిలెట్లు, వైద్యశిబిరం, అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేశారు. జిల్లా అధికారులు, పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ హన్మకొండ నుండి మేడారం వరకు బస్సులు సజావుగా గమ్యం చేరేలా చర్యలు చేపట్టారు. బస్సులు తాత్కాలికంగా మేడారానికి (Medaram Jatara) వెళ్తుండటం వల్ల ఇతర నగరాలు, జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు తక్కువ మొత్తంలో నడవనున్నట్లు అధికారులు ప్రకటించారు.
Read Also: మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు.. వివరాలు ఇవే
Follow Us On: Instagram


