కలం, వెబ్ డెస్క్: పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ పర్యటనకు బయలుదేరిన సీఎం రేవంత్ (CM Revanth Reddy) బృందానికి స్విట్జర్లాండ్లో ఘనస్వాగతం లభించింది. జ్యురిచ్ నగరానికి చేరుకున్న సీఎం టీమ్కు ప్రవాస తెలంగాణ వాసులు ఘనస్వాగతం పలికారు. ‘వెల్కం టు దావోస్ రేవంత్ అన్నా’ అని ప్లకార్డులు ప్రదర్శించారు. రేవంత్తో సెల్ఫీలు, ఫొటోలు దిగి ఆనందం వ్యక్తం చేశారు. జ్యురిచ్ విమానాశ్రయంలో భారత రాయబారి మృదుల్ కుమార్ కూడా సీఎ రేవంత్కు స్వాగతం పలికారు. మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. సీఎం వెంట మంత్రి పొంగులేటి, ఉన్నతాధికారులు ఉన్నారు.
దావోస్లో నాలుగు రోజుల పాటు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సమావేశాలు తెలంగాణ ప్రతినిధి బృందం పాల్గొననుంది. మొదటి రోజున వివిధ రంగాలకు చెందిన కంపెనీల పారిశ్రామికవేత్తలతో జరిగే సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
ఈ సందర్బంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ రోడ్ మ్యాప్ను పరిచయం చేయనున్నారు. తెలంగాణ (Telangana) రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి లక్ష్యాలు, ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులకున్న అనుకూలతలను ప్రస్తావించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. డిసెంబర్లో ప్రభుత్వం ఆవిష్కరించిన ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్‘ డాక్యుమెంట్లో పొందుపరిచిన అభివృద్ధి నమూనాకు అనుగుణంగా సుస్థిర పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యం ఎంచుకున్నారు.


