కలం/ఖమ్మం బ్యూరో: నమ్మకద్రోహం, చీటింగ్ సెక్షన్ల కింద నమోదైన కేసులో పోలీసులకు లొంగిపోవాలని ‘సిరి గోల్డ్’ ఛైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్, బీజేపీ నాయకుడు కూసంపూడి రవీంద్ర (Kusampudi Ravindra) ను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న రవీంద్ర ముందస్తు బెయిల్ కోసం చేసుకున్న పిటిషన్ను గురువారం న్యాయస్థానం విచారించింది. అనంతరం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పిటిషనర్ రవీంద్ర రెండు వారాల్లోపు ఉప్పల్ పోలీస్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ఆ తర్వాత అతడిని హౌజ్ ఆఫీసర్ బెయిల్పై విడుదల చేయాలని చెప్పింది. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతోపాటు రూ.25,000 వ్యక్తిగత బాండ్ సమర్పించాలని రవీంద్రను కోర్టు ఆదేశించింది. ఎనిమిది వారాల పాటు ప్రతి బుధవారం పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని పేర్కొంది. కేసు దర్యాప్తునకు దర్యాప్తునకు అధికారులకు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది.


