కలం, పెద్దపల్లి : పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రజల భద్రత, మెరుగైన కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ (MP Vamshi Krishna) ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 9 రైల్వే అండర్ బ్రిడ్జిల (RUB) నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ ఆయన ఇటీవల ఉన్నత స్థాయి రైల్వే అధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. ముఖ్యంగా LC-30, LC-35, LC-37 ప్రాంతాల్లో నేచురల్ డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులో లేకపోవడం వల్ల వర్షాకాలంలో నీరు చేరి స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులకు వివరించారు. ఇప్పటికే మంజూరైన RUBలు, వాటికి సంబంధించిన అప్రోచ్ రోడ్ల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
ఎంపీ చొరవపై సానుకూలంగా స్పందించిన రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని, వచ్చే ఏడాది నాటికి అన్ని పనులనూ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పెద్దపల్లి నియోజకవర్గాన్ని మౌలిక వసతుల పరంగా రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు, ప్రజల అవసరాలకు అనుగుణంగా నిరంతరం శ్రమిస్తానని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు.

