కలం, వెబ్ డెస్క్ : ఏపీలో ఎల్నినో ప్రభావంతో తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలు, యాక్షన్ ప్లాన్ అమలుపై సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, ఆర్ఎస్ కే సిబ్బందితో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో యాక్షన్ ప్లాన్ పై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు అండగా నిలవడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చర్యలు చేపట్టాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. బియ్యం, ఉల్లి, పామాయిల్, కందిపప్పు ధరలు పెరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
గోడౌన్లలో అందుబాటులో ఉన్న బియ్యం నిల్వలను అవసరానికి అనుగుణంగా మార్కెట్లోకి విడుదల చేయాలని సీఎం (CM Chandrababu) సూచించారు. అలాగే ఉల్లి కొనుగోళ్లను చేపట్టడంతో పాటు భవిష్యత్తులో ఏర్పడే డిమాండ్కు అనుగుణంగా ఉల్లి సాగును ప్రోత్సహించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. ఎల్నినో ప్రభావంతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

