కలం, వెబ్ డెస్క్: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వర రావు ప్రవచనం వినపడని ఇల్లు తెలుగు రాష్ట్రాల్లో లేదని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) కొనియాడారు. కాకినాడ రూరల్ తిమ్మాపురం ఆకుండి లక్ష్మీ స్మారక గోశాలలో ఆదివారం నిర్వహించిన ‘భారతీయం’ కార్యక్రమంలో చాగంటితో పాటు మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ.. క్లాస్ రూమ్ నుంచే సమాజంలో మార్పు సాధ్యమని.. అందుకే విద్యాశాఖను ఎంచుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే ఏపీ విద్యావ్యవస్థ మొదటి స్థానంలో నిలుస్తుందని ఆకాంక్షించారు.
చాగంటి (Chaganti Koteswara Rao) ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయం కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు లోకేశ్ తెలిపారు. సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదుగుదామని పిలుపునిచ్చారు. దేశభక్తి, నైతిక విలువలే మన కుటుంబ వ్యవస్థకు పునాది అని తెలిపారు. విద్యార్థులు విలువలతో ఎదిగి.. తల్లిదండ్రులకు, దేశానికి గర్వకారణంగా నిలవాలని కోరారు. విద్య ద్వారా సమాజంలో గణనీయమైన మార్పు తీసుకురావచ్చని అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు దూరంగా విద్యా వ్యవస్థ ఉండాలన్న లోకేశ్.. విద్య, ప్రభుత్వ పాఠశాలలు అంటే సీఎం చంద్రబాబుకు ఎంతో ఇష్టమని అన్నారు.
రంపచోడవరం బాలిక సూసైడ్ ఘటన తననెంతో తీవ్రంగా కలిచివేసిందని మంత్రి లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా విద్యార్థులు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. జీవితంలో కష్టతరమైన సమస్యలు వచ్చినా.. వాటిని పరిష్కరించుకునే మార్గాలు ఉంటాయనన్నారు. ఇబ్బందులు ఎదురైనప్పుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, నమ్మకమైన పెద్దలతో మాట్లాడాలన్నారు. పిల్లలు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం తల్లిదండ్రులకు జీవితాంతం కడుపుకోత మిగులుతుందని.. అలాంటి పనులు ఎప్పుడూ చేయద్దని అన్నారు.

