ఆసియా గేమ్స్‌లో భారత్ బోణీ

కలం, స్పోర్ట్స్ : ఆసియా గేమ్స్ (Asian Games) మహిళల హాకీ టోర్నీలో భారత జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన పూల్-బి తొలి మ్యాచ్‌లో ఉజ్బెకిస్తాన్‌ను భారత్ 19-0 తేడాతో చిత్తు చేసింది. ఆట మొదలైనప్పటి నుంచే భారత స్ట్రైకర్లు ఉజ్బెకిస్తాన్ డిఫెన్స్‌పై తీవ్ర ఒత్తిడి పెంచారు. ఈ మ్యాచ్‌లో భారత క్రీడాకారిణి దీపిక ఏకంగా ఎనిమిది గోల్స్ చేసి రికార్డు సృష్టించింది. తొడ గాయంతో బరిలోకి దిగిన లాల్రెమ్‌సియామి ఏడో నిమిషంలో భారత్‌కు తొలి గోల్ అందించింది. వెంటనే దీపిక కూడా తన ఖాతా తెరిచింది. సునెలితా తోప్పో ఇచ్చిన పాస్‌ను ఇషిక గోల్‌గా మలిచింది.

ఆ తర్వాత బాల్జీత్ కౌర్, నేహా గోయల్ చెరో గోల్ చేశారు. ద్వితీయార్థంలో దీపిక పెనాల్టీ కార్నర్ల ద్వారా వరుసగా గోల్స్ సాధించి ఉజ్బెకిస్తాన్‌ను దెబ్బతీసింది. లాల్తాంట్లువాంగి పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మార్చగా, నవ్‌నీత్ కౌర్ కూడా రెండు గోల్స్ కొట్టింది. ఇషిక తన చివరి గోల్‌ను 54వ నిమిషంలో పూర్తి చేసింది. ముందుగా బాల్జీత్ కౌర్ చేసిన ఒక గోల్‌ను అంపైర్లు రద్దు చేశారు. బంతి దీపిక కాలికి తగలడమే దీనికి కారణం. ఈ మ్యాచ్‌లో ఉజ్బెకిస్తాన్ జట్టు భారత సర్కిల్‌లోకి కేవలం మూడు సార్లు మాత్రమే రాగలిగింది.

భారత్ మాత్రం ఏకంగా 66 సార్లు ప్రత్యర్థి సర్కిల్‌లోకి దూసుకెళ్లింది. దీనితో భారత గోల్‌కీపర్లు సవితా పునియా, బిచు దేవిలకు పెద్దగా పనే లేకుండా పోయింది. ఈ విజయంతో గ్రూప్ దశలో భారత్ పూర్తి పాయింట్లు సాధించింది. సోమవారం జరగనున్న తదుపరి మ్యాచ్‌లో ఇండోనేషియాతో భారత్ తలపడనుంది. ఆ తర్వాత థాయిలాండ్, జపాన్ జట్లతో భారత్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. 44 ఏళ్ల తర్వాత ఆసియా గేమ్స్‌లో స్వర్ణం గెలవడమే లక్ష్యంగా భారత జట్టు ముందుకు సాగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>