కలం, వెబ్ డెస్క్ : ముంబైలోని ప్రతిష్టాత్మక ఐఐటీ బాంబే (IIT Bombay) ప్రాంగణంలో విషాదం చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ విభాగంలో రెండవ సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థి శుక్రవారం సాయంత్రం తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు.
అంతకుముందు రోజు జరిగిన పరీక్ష సమయంలో సదరు విద్యార్థి తన మొబైల్ ఫోన్ ఉపయోగించి ప్రశ్నపత్రాన్ని చాట్జీపీటీకి అప్లోడ్ చేసి సమాధానాలు వెతుకుతుండగా నిర్వాహకులు పట్టుకున్నారు. అయితే ఈ విషయమై ఐఐటీ యాజమాన్యం సంబంధిత కోర్సు ఇన్స్ట్రక్టర్, విభాగాధిపతి ఆ విద్యార్థితో మాట్లాడి కౌన్సెలింగ్ ఇచ్చారు.
కౌన్సెలింగ్ అనంతరం విద్యార్థి తిరిగి తన హాస్టల్ గదికి వెళ్ళాడు. అయితే ఆ తర్వాత సాయంత్రం సమయంలో అతను తన గదిలోనే ప్రాణాలు కోల్పోయి కనిపించాడు. ఈ ఘటనపై ఐఐటీ బాంబే విచారం వ్యక్తం చేసింది. విద్యార్థి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఐఐటీ యాజమాన్యం తమ సానుభూతి తెలియజేస్తూ మద్దతుగా నిలుస్తోంది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
విద్యార్థుల నిరసన..పరీక్షలు వాయిదా
ఈ సంఘటన తరువాత వందలాది మంది విద్యార్థులు క్యాంపస్ ప్రధాన భవనం వద్ద గుమిగూడి నిరసనకు దిగారు. విచారణ ప్రక్రియలలో పారదర్శకత ఉండాలని, క్రమశిక్షణా చర్యల పేరిట విద్యార్థులపై ఒత్తిడి తేకూడదని, యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తుండగా, విద్యార్థుల ఆందోళనల దృష్ట్యా మిడ్-సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేశారు.

