కలం, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడలోని కేటీఆర్ ఫామ్హౌస్ (Janwada Farmhouse) పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఫామ్హౌస్ను నేడు కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించనున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యగా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఉదయం ప్రజాభవన్ నుంచి బయలుదేరిన కాంగ్రెస్ బృందం, ఈ ఫామ్హౌస్కు సంబంధించిన భూముల రికార్డులు, పహాణీలు, పట్టాదారు వివరాలు, యాజమాన్య హక్కులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వెలికట్ట ప్రాంతంలో హరీశ్ రావు బంధువు హనుమంత రావుకు చెందిన అసైన్డ్ భూములను ఈ బృందం తనిఖీ చేసింది.
మరోవైపు ఈ వివాదంపై స్పందించిన ప్రదీప్రెడ్డి, జన్వాడలోని నాలుగు ఎకరాల ఫామ్హౌస్ తన సొంత ఆస్తి అని, కేటీఆర్కు కేవలం లీజుకు మాత్రమే ఇచ్చానని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. రాజకీయ ప్రయోజనాల కోసం తన ప్రైవేటు ఆస్తిలోకి అనుమతి లేకుండా చొరబడితే చట్టప్రకారం క్రిమినల్ ట్రెస్పాస్ కేసులు పెడతానని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల పర్యటన ఖరారు కావడంతో జన్వాడ ప్రాంతంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

