కలం, చండ్రుగొండ: ఆర్యవైశ్యులు కేవలం వ్యాపార రంగానికే పరిమితం కాకుండా సామాజిక, ఆర్థిక, రాజకీయ తదితర అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభ చాటాలని, సమాజ అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వాసవి క్లబ్ భద్రాద్రి కొత్తగూడెం (Bhadadri Kothagudem) జిల్లా వాసవి క్లబ్ గవర్నర్ చారుగుండ్ల శ్రీనివాస్ (Charugundla Srinivas) పిలుపునిచ్చారు. చండ్రుగొండ (Chandrugonda) మండల వాసవి క్లబ్ అధ్యక్షుడు వీఎన్ కుక్కడపు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లా గవర్నర్ చారుగుండ్ల శ్రీనివాస్ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి.
వేడుకల్లో భాగంగా ముందుగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి మండపంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితులు విప్పర్ల వేణు శర్మ పూజలు జరిపించి ఆశీర్వచనం అందించారు. అనంతరం జాతీయ రహదారి వెంబడి మొక్కలు నాటి, మండల కేంద్రంలోని ప్రధాన సెంటర్లో భారీ కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా ఓ నిరుపేద కుటుంబానికి నెలకు సరిపడా బియ్యం, పప్పులు, నిత్యావసర సరుకులు పంపిణీ చేసి ఉదారత చాటుకున్నారు. తన పుట్టినరోజు వేడుకలను వినూత్నంగా నిర్వహించిన వాసవి క్లబ్ సభ్యులకు గవర్నర్ శ్రీనివాస్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ చీమకుర్తి రాజ మనోహర్, రీజినల్ చైర్మన్ ధూపకుంట్ల అనిల్ కుమార్, జోన్ చైర్మన్ చీమకుర్తి నాగరాజా తరుణ్, తదితరులు పాల్గొన్నారు.

