కలం, స్పోర్ట్స్: 46వ చెస్ ఒలింపియాడ్లో భారత పురుషుల జట్టుకు కష్టకాలం ఎదురవుతోంది. తొలి రెండు రౌండ్లు ముగిసేసరికి ప్రపంచ ఛాంపియన్ గుకేష్ లైవ్ రేటింగ్ (Gukesh Rating Drops) 2700 కంటే కిందకు పడిపోయింది. తక్కువ ర్యాంక్ కలిగిన జట్లతో జరిగిన మ్యాచ్లలో భారత జట్టు విజయాలు సాధించినప్పటికీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. రెండో రౌండ్లో ఇండోనేషియా ఆటగాడు సత్రియా దుతా సహయాతో జరిగిన గేమ్ను గుకేష్ డ్రాగా ముగించాడు. దీంతో ఆయన లైవ్ రేటింగ్ 2699.5 పాయింట్లకు పడిపోయింది.
వచ్చే నవంబర్లో జెనీవాలో గుకేష్తో తలపడనున్న ఉజ్బెకిస్తాన్ ఆటగాడు జావోఖిర్ సిందరోవ్కు ఈ ఫలితం మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే అవకాశం ఉంది. గత ఒలింపియాడ్లలో టాప్ బోర్డులో స్వర్ణం గెలిచిన గుకేష్ను, ఈసారి ప్రస్తుత ఫామ్ ఆధారంగా మేనేజ్మెంట్ నాలుగో బోర్డుకు పరిమితం చేసింది. భారత పురుషుల జట్టు తొలి రౌండ్లో థాయ్లాండ్పై 3-1 తేడాతో గెలవగా, రెండో రౌండ్లో ఇండోనేషియాపై 2.5-1.5 తేడాతో కష్టపడి నెగ్గింది.
మూడో రౌండ్లో బలమైన ఇటలీ జట్టుతో భారత్ తలపడనుంది. ఇందులో ప్రజ్ఞానానంద్, అర్జున్ ఇరిగైసి, నిహాల్ సరిన్, గుకేష్ బరిలోకి దిగుతున్నారు. మరోవైపు భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తోంది. తొలి రౌండ్లో డొమినికన్ రిపబ్లిక్ను 4-0తో క్లీన్ స్వీప్ చేయగా, రెండో రౌండ్లో ఫిన్లాండ్పై 3.5-0.5తో ఘనవిజయం సాధించింది. మూడో రౌండ్లో గ్రీస్తో భారత మహిళలు పోటీపడనున్నారు. ఇందులో కోనేరు హంపి, దివ్య దేశ్ముఖ్, వంతిక అగర్వాల్, బి.సవితా శ్రీ పోటీపడుతున్నారు.

