కలం, మిర్యాలగూడ: చింతలపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ పురోహితుడు, బ్రహ్మ శ్రీ దత్తాత్రేయ శర్మ అకాల మరణాన్ని నిరసిస్తూ మిర్యాలగూడ పట్టణంలో బ్రాహ్మణ సంఘాల నాయకులు, పురోహితులు (Brahmin Association) గురువారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. దత్తాత్రేయ శర్మ ఆకస్మిక మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పురోహితులు, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సంతాపం తెలిపారు.
ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. సమాజంలో ఆధ్యాత్మిక మార్గాన్ని చూపే పురోహితుల పట్ల దురుసు ప్రవర్తన, వేధింపులు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో బ్రాహ్మణులకు తగిన గౌరవం కల్పించాలని, వారిపై జరుగుతున్న దాష్టీకాలను, దురుసు ప్రవర్తనను ప్రభుత్వం వెంటనే అరికట్టాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. నిరసనలో భాగంగా బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు కీలక ప్రకటన చేశారు.
పురోహితుల భద్రత, గౌరవం కోసం మిర్యాలగూడ పట్టణ పరిధిలోని అన్ని దేవాలయాలతో పాటు గణపతి మండపాల్లో సైతం పూజలను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. బ్రాహ్మణుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక దృష్టి సారించి, తగిన న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన ర్యాలీలో మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన వివిధ బ్రాహ్మణ సంఘాల పెద్దలు, దేవాలయాల అర్చకులు, పెద్ద సంఖ్యలో పురోహితులు పాల్గొని తమ నిరసనను తెలిపారు.

