కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) వ్యవహారంలో శాసనసభ ఎథిక్స్ కమిటీకి సమయం పొడిగిస్తూ శాసనసభ నిర్ణయం తీసుకుంది. ఆయనపై వచ్చిన ఫిర్యాదులు, క్రమశిక్షణ చర్యల అంశంపై పూర్తి స్థాయిలో పరిశీలించి నివేదిక అందించేందుకు ఎథిక్స్ కమిటీకి మరికొంత గడువు కావాలని కోరగా సభ అందుకు ఆమోదం తెలిపింది.
గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎథిక్స్ కమిటీకి ఈ వ్యవహారాన్ని బదిలీ చేశారు. ఈ విషయంపై సమీక్ష నిర్వహించి నివేదికను సిద్ధం చేసేందుకు మరికొంత సమయం పడుతుండటంతో కమిటీ గడువు పెంపు ప్రతిపాదన ముందుకు వచ్చింది.
శాసనసభ సభ్యుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఈ ప్రతిపాదనకు సంబంధించిన తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ మద్దతు తెలపగా, శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీనితో రాబోయే శాసనసభ సమావేశాల వరకు ఎథిక్స్ కమిటీ తన విచారణ నివేదికను సమర్పించడానికి గడువు పొడిగించబడింది. రాబోయే సమావేశాల్లో కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కౌశిక్ రెడ్డిపై తీసుకునే చర్యలపై స్పష్టత రానుంది.

