కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ శాసనసభలో ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (Paidi Rakesh Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. సభలో తనను మాట్లాడనివ్వకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన బహిరంగంగా ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లా పట్ల తీవ్ర వివక్ష చూపిస్తోందని, నిధుల కేటాయింపుల్లో చిన్నచూపు చూస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్ నియోజకవర్గంతో పాటు పలువురు మంత్రుల నియోజకవర్గాలకు భారీగా నిధులు తరలిస్తున్నారని, కానీ నిజామాబాద్ జిల్లాకు ఇచ్చింది ఏమీ లేదని మండిపడ్డారు.
తమ జిల్లాకు ఏ మేరకు నిధులు కేటాయించారో స్పష్టమైన ఆధారాలు, చిట్టా తన వద్ద ఉన్నాయని రాకేష్ రెడ్డి వెల్లడించారు. సభలో ప్రభుత్వం వైఖరిని ఎండగట్టేందుకు, నిధుల వివక్షపై పూర్తి లెక్కలు చెప్పేందుకు తనకు కనీసం పది నిమిషాల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. శాసనసభ సాక్షిగా జిల్లాకు జరిగిన అన్యాయాన్ని అన్ని వివరాలతో సహా బయటపెట్టి, ఆ తర్వాతే అవసరమైతే తన పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు.

