కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నిర్వహించాలనుకున్న అభిమానుల ఆత్మీయ భేటీ కార్యక్రమాన్ని లండన్ (Vijay London) పోలీసులు రద్దు చేశారు. ముఖ్యమంత్రిగా తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా లండన్ వెళ్లిన విజయ్, అక్కడ ఉన్న తన అభిమానులను నేరుగా కలిసి మాట్లాడేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, ఈ భేటీ కోసం భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చే అవకాశం ఉండటంతో, భద్రత, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు ముందస్తుగా అనుమతి నిరాకరించారు.
పోలీసుల నిరాకరణతో నిర్వాహకులు ఈ భేటీని అనివార్యంగా రద్దు చేయాల్సి వచ్చింది. అభిమానులు, పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీవీకే (TVK) ఐటీ వింగ్ ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యమంత్రి విజయ్ బస చేసిన హోటల్ ప్రవేశ ద్వారాల వద్ద గానీ, ఆయన ప్రయాణించే మార్గాల్లో గానీ ఎవరూ గుమిగూడ వద్దని పార్టీ శ్రేణులు స్పష్టం చేశాయి. దీంతో తమ ప్రియతమ నాయకుడిని చూడటానికి వచ్చిన అభిమానులకు ఈ వార్త నిరాశను మిగిల్చింది.

