కలం, జోగులాంబ గద్వాల: గద్వాల (Gadwal) నియోజకవర్గంలోని ఐదు గ్రామాల ప్రజల ఎనిమిదేళ్ల రవాణా కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కొండాపురం గ్రామ సర్పంచ్ ఎస్. పవన్ కుమార్ రెడ్డి మంగళవారం గద్వాల డిపో మేనేజర్ (DM)ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గత 8 సంవత్సరాలుగా కేటిదొడ్డి మండలం కొండాపురం, వెంకటాపురం, పాగుంట, ముసల్దొడ్డి, ఇర్కిచేడు గ్రామాలకు బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాలను సర్పంచ్ డీఎం దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా, ఈ మార్గంలో బస్సు నడపడం ద్వారా ఆర్టీసీకి వచ్చే రాబడి వివరాలను, రూట్ మ్యాప్ను వివరించారు. సర్పంచ్ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన డీఎం, రాబోయే 20 రోజుల్లోగా ఈ ఐదు గ్రామాలకు బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.

