కలం, నల్లగొండ: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతిఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠించాలని నల్లగొండ డీఎస్పీ కే. శివరాం రెడ్డి (Nalgonda DSP Shivaram Reddy) పిలుపునిచ్చారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల వద్ద నిర్వహించిన కార్యక్రమంలో భక్తులకు మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీఎస్పీ శివరాం రెడ్డి విగ్రహాల పంపిణీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారు చేసే విగ్రహాల వల్ల జల వనరులు తీవ్రంగా కలుషితమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సహజ సిద్ధమైన మట్టి విగ్రహాలను ఉపయోగించడం వల్ల నీటి కాలుష్యాన్ని సమర్థవంతంగా అరికట్టవచ్చని తెలిపారు. పర్యావరణహితమైన మట్టి గణపతులను ప్రోత్సహిస్తూ ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమని నిర్వాహకులను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ పుల్లారావు, ట్రాఫిక్ ఎస్ఐ విజయభాయి, గుంటోజు మహేష్తో పాటు పలువురు స్థానిక ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.

