కలం, నిర్మల్ : ఇతర రాష్ట్రాల డీజేలను (DJs) తెలంగాణలోకి అనుమతించవద్దని డిమాండ్ చేస్తూ నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట జిల్లా సౌండ్ లైట్స్ యూనియన్ (Sound and Lights Union) డీజే ఆపరేటర్లు (DJ Operators) ఆధ్వర్యంలో బుధవారం ధర్నా (Protest) నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి డీజేలను తీసుకొచ్చి వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ఏర్పాటు చేయడం వల్ల స్థానిక డీజే నిర్వాహకులకు ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక డీజే నిర్వాహకులకు తీవ్ర నష్టం
ఏళ్లుగా సౌండ్ సిస్టమ్ రంగంపై ఆధారపడి జీవిస్తున్న స్థానికులకు ఇతర రాష్ట్రాల డీజేల రాక తీవ్ర నష్టం కలిగిస్తోందన్నారు. అంతేకాకుండా భారీ శబ్దాలతో కూడిన డీజేల వల్ల ప్రజలు ఇబ్బందులు పడటంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా జిల్లాకు సమీపంలోని మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో డీజేలను తీసుకువస్తున్నారని, దీనిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఇతర రాష్ట్రాల డీజేలను తెలంగాణలోకి తీసుకురాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసు శాఖను కోరారు.

