కలం, మంథని: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా మంథని (Manthani) పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ప్రధాన రోడ్డుపై బైఠాయించి డప్పులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ నిరసన కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిలి ప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుదుదుల వెంకన్న, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మంథని రాకేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి జనగామ నర్సింగరావు, గ్రామ శాఖ అధ్యక్షులు చంద్రు రాజమల్లు తదితరులు హాజరై మాట్లాడారు.
వారు మాట్లాడుతూ.. దళిత వర్గానికి చెందిన స్పీకర్ పై ఎమ్మెల్సీ తాతా మధు (Tata Madhusudan) తీవ్ర పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేయడం అత్యంత అభ్యంతరకరమని మండిపడ్డారు. నిండు సభలో స్పీకర్ కంటతడి పెట్టడం బాధాకరమని అన్నారు. చట్టసభల గౌరవాన్ని దిగజార్చేలా ప్రవర్తించిన తాతా మధును వెంటనే శాసనమండలి నుండి తొలగించి, ఆయన చేత బహిరంగ క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. ఒక దళిత స్పీకర్ను ఉద్దేశించి మాట్లాడిన తీరు బీఆర్ఎస్ నేతల దురహంకారానికి నిదర్శనమని విమర్శించారు.
ఇది కేవలం ఒక వ్యక్తిపై చేసిన వ్యాఖ్య కాదని, దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని వారు ఫైర్ అయ్యారు. తెలంగాణ సమాజం ముక్తకంఠంతో దీనిని ఖండిస్తోందని చెప్పారు. సభలో ప్రజల సమస్యలపై మాట్లాడే ధైర్యం లేక, తమ నాయకుడు అసెంబ్లీకి రాకపోవడంపై సమాధానం చెప్పుకోలేక బీఆర్ఎస్ నాయకులు ఇలాంటి పిచ్చివేషాలు వేస్తూ విషయాలను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ ఉనికి కోసం ఆరాటపడుతోందని అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా కాకుండా అనైతిక చర్యలకు పాల్పడుతున్న బీఆర్ఎస్ నాయకులకు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Also Read : పారా ఆర్చరీలో భారత్ జోరు.. రెండు స్వర్ణాలు!
Follow Us On: X(Twitter)

