కలం, మహబూబ్ నగర్ బ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని ఏఐటీయూసీ (AITUC) మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శి పి.సురేష్ ధ్వజమెత్తారు. ఈ నెల 6, 7, 8వ తేదీల్లో కరీంనగర్లో జరిగే రాష్ట్ర నాలుగో మహాసభలను పురస్కరించుకుని శనివారం బస్సు యాత్రను ప్రారంభించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని సురవరం వెంకట్రామారెడ్డి భవన్ ఎదుట ఏఐటీయూసీ జెండా ఆవిష్కరించారు. ఉమ్మడి జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నేతలు సురవరం సుధాకర్ రెడ్డి, కామ్రేడ్ లింగారెడ్డి, ఈర్ల నరసింహ, ఎం.బి.కృష్ణయ్య, డి.చంద్రయ్య, కొండన్న స్మారక అమర జ్యోతి కాగడా వెలిగించారు.
కార్మికుల శ్రమ దోపిడీ..
ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. చట్టాలను కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా మారుస్తూ కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేసేలా నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ చట్టాలు అమలు చేయకపోవడంతో పట్టించుకునే నాథుడే లేడన్నారు. ఈ నేపథ్యంలోనే కార్మికుల హక్కుల సాధనకు సెప్టెంబర్ 6న కరీంనగర్ జిల్లా కేంద్రంలో కార్మిక మహా ప్రదర్శన సభను నిర్వహిస్తున్నామని వివరించారు.
ఈ కార్యక్రమంలో గాయని శ్యామల, ఏఐటీయూసీ జిల్లా నేతలు కార్మికులు ఎస్.దేవానంద్, రంగన్న, బాలకోటి, రాఘవేందర్, గోపాల్ నాయక్, శ్రీశైలం, శంకర్, భీమయ్య, అంజి యాదయ్య, యాదగిరి,జగ్గా నాయక్,వెంకటన్న, గోపాల్,బాలరాజ్, ఎస్ మన్యం, రామస్వామి,రాఘవేందర్, సాయి ప్రకాష్, నరసింహ, సత్యమ్మ, సువర్ణ, నాగమణి, నాగమ్మ, లక్ష్మమ్మ,అంజమ్మ, లక్ష్మి, మంగమ్మ, మల్లమ్మ, మంజుల, నిరీక్షణ, భాగ్యలక్ష్మి,పద్మ, విజయ్ నిర్మల తదితరులు పాల్గొన్నారు.

