కలం, వనపర్తి : అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్నా ప్రధాన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, పార్టీ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ఎన్నికల హామీల అమలును డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం వనపర్తి గాంధీచౌక్లో వంటావార్పు నిరసన (BRS Protest) కార్యక్రమం నిర్వహించారు.
వృద్ధులు, వికలాంగుల పెన్షన్లను పెంచడంతో పాటు మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి, విద్యార్థినులకు స్కూటీలు తదితర హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, పార్టీ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు పలస రమేష్ గౌడ్, వనపర్తి మండల అధ్యక్షుడు కే. మాణిక్యం మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.
అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్నా ప్రధాన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినా వితంతువులు, హెచ్ఐవీ బాధితులకు ఆసరా పెన్షన్లు అందించిందని వారు గుర్తుచేశారు. వృద్ధులు, వికలాంగులు, ఇతర పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు పెన్షన్లను పెంచినట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లను మరింత పెంచుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని, అయితే వెయ్యి రోజులు గడిచినా ఆ హామీ అమలుకు నోచుకోలేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు, పట్టణ, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

