కలం, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో 60 రోజుల ప్రత్యేక ఉచిత శిక్షణ (Free Coaching) బ్యాచ్ను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 200 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో 100 మంది కానిస్టేబుల్, 100 మంది ఎస్ఐ అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 5 నుంచి 11వ తేదీ వరకు బీసీ స్టడీ సర్కిల్, ఆదిలాబాద్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
అభ్యర్థుల ఎంపికలో బీసీలకు 25 శాతం, ఎస్సీలకు 25 శాతం, ఎస్టీలకు 25 శాతం, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్, అనాథలకు 25 శాతం చొప్పున కేటాయింపు ఉంటుందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. అభ్యర్థులు రూ.3 లక్షల ఆదాయ పరిమితికి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికెట్ తో పాటు కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్లు, పోలీస్ ఉద్యోగానికి దరఖాస్తు చేసిన పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు పోలీస్ రిక్రూట్మెంట్ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని సూచించారు. సెప్టెంబర్ 16న మెరిట్ జాబితా విడుదల చేసి, సెప్టెంబర్ 17, 18 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 19 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని, శిక్షణలో భాగంగా అభ్యర్థులకు ఉచిత పుస్తకాలు అందించడంతో పాటు ప్రతిరోజూ నిపుణులైన అధ్యాపకులతో నాలుగు తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు బీసీ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిల్, ఆదిలాబాద్ కార్యాలయాలను, అలాగే 08732-221280, 9949684959, 9494149416 మొబైల్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.

