కలం, వెబ్ డెస్క్ : వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ పరిధిలో దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) విగ్రహ ఏర్పాటుపై వివాదం తీవ్రరూపం దాల్చింది. గతంలో నర్సంపేట మెడికల్ కాలేజీ ఎదుట ఏర్పాటు చేసిన సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు తొలగించడంతో, బీఆర్ఎస్ నాయకులు ఖానాపూర్ (Khanapur) మండలం అశోక్ నగర్ గ్రామంలో విగ్రహ ప్రతిష్ఠాపన కోసం ప్రత్యామ్నాయంగా గద్దె నిర్మాణాన్ని చేపట్టారు. ఇటీవల భూమిపూజ నిర్వహించి నిర్మాణం ప్రారంభించగా, అర్ధరాత్రి వేళ మున్సిపల్ అధికారులతో కలిసి కాంగ్రెస్ నాయకులు ఆ గద్దెను కూల్చివేశారని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, మున్సిపల్ అనుమతుల పేరుతో రాత్రికి రాత్రే నిర్మాణాలు కూల్చివేయడం రాజకీయ కక్షసాధింపు చర్యేనని స్థానిక బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. ప్రజా నాయకుని జ్ఞాపకాలను గౌరవించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కుట్రలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. అధికారులను అడ్డుపెట్టుకుని అధికార పార్టీ నాయకులు చేస్తున్న ఈ అరాచకాలపై బీఆర్ఎస్ కార్యకర్తలు, పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) అభిమానులు ఆందోళనకు దిగడంతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
Also Read : ఇస్రో ఖాతాలో మరో విజయం.. నింగిలోకి GSLV-F17
Follow Us On : WhatsApp

