కలం, మెదక్ బ్యూరో: మెదక్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ హాస్టల్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) ఆదేశించారు. వచ్చే ఏడాదిలోగా భవనాలను విద్యార్థులకు అదుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కాలేజీల భవనాల నిర్మాణ పురోగతి, మెదక్ జనరల్ హాస్పిటల్ పనితీరుపై కోఠిలోని తెలంగాణ మెడికల్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫీస్లో సమీక్ష చేశారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు పాల్గొన్నారు.
అద్దె భవనాల్లో అన్ని సౌకర్యాలు..
ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ.. సుమారు రూ.156 కోట్లతో చేపడుతున్న మెడికల్ కాలేజీ, హాస్టల్స్, నర్సింగ్ కాలేజీ భవనాల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు వివరించారు. ప్రస్తుతం అద్దె భవనాల్లో కాలేజీలు, హాస్టళ్లు కొనసాగుతున్నాయని చెప్పారు. అయితే, అందులో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని మంత్రి ఆదేశించారు. ఆయా నిర్మాణాలు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అక్కడకు వెళ్లి తెలుసుకోవాలని డీఎంఈని ఆదేశించారు. ఏదైనా ఇబ్బంది ఉంటే అన్ని సౌకర్యాలున్న ఇతర భవనాలను అద్దెకు తీసుకుని, హాస్టళ్లను అక్కడికి మార్చాలని సూచించారు. ప్రస్తుతం పాత భవనంలోనే మెదక్ జనరల్ హాస్పిటల్ కొనసాగుతోందని, త్వరలోనే కొత్త హాస్పిటల్ భవనాలను మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు.

