కలం, స్పోర్ట్స్: దక్షిణాఫ్రికాలోని సన్ సిటీలో 2026 ఐపీఎఫ్ వరల్డ్ సబ్-జూనియర్ అండ్ జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఘనంగా ముగిసింది. ఈ పోటీల్లో భారత మహిళా అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో సంచలనం సృష్టించారు. 21 ఏళ్ల కీయా కునాల్ బెనర్జీ (Keeya Kunal Banerjee) జూనియర్ ఉమెన్స్ 47 కేజీల విభాగంలో పోటీ పడింది. కేవలం 45.70 కేజీల శరీర బరువున్న కీయా, ఏకంగా 140 కేజీల డెడ్లిఫ్ట్ చేసి వెండి పతకం కైవసం చేసుకుంది. తన బరువు కంటే మూడు రెట్లకు పైగా బరువును ఎత్తి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విభాగంలో ఫ్రాన్స్కు చెందిన ఇనెస్ హెర్బాక్స్ ప్రథమ స్థానంలో నిలిచింది. కీయా స్క్వాట్లో 90 కేజీలు, బెంచ్ ప్రెస్లో 50 కేజీలు, డెడ్లిఫ్ట్లో 140 కేజీలతో మొత్తంగా 280 కేజీల బరువు ఎత్తింది.
సత్తా చాటిన కీయా..
ఈ ప్రదర్శన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయి, దేశవ్యాప్తంగా పవర్ లిఫ్టింగ్పై చర్చకు దారితీసింది. గతంతో పోలిస్తే కీయా (Keeya Kunal Banerjee) తన ప్రతిభను ఎంతగానో మెరుగుపరుచుకుంది. 2025 జాతీయ ఛాంపియన్షిప్లో ఆమె మొత్తం 257.5 కేజీలు మాత్రమే ఎత్తింది. 2026 జాతీయ ఛాంపియన్షిప్లో ఆ సంఖ్యను 287.5 కేజీలకు పెంచుకుంది. అదే ఫామ్ను కొనసాగిస్తూ ఇప్పుడు ప్రపంచ వేదికపై రజతం సాధించింది. మరోవైపు, జల్ పాయిగురికి చెందిన 12వ తరగతి విద్యార్థిని మధుర కర్ సరికొత్త చరిత్ర సృష్టించింది.
బంగారు పతకాలు సాధించిన మధుర..
సబ్-జూనియర్ ఉమెన్స్ 52 కేజీల విభాగంలో పోటీపడిన మధుర, నాలుగు విభాగాల్లోనూ బంగారు పతకాలు సాధించింది. స్క్వాట్లో 107.5 కేజీలు, బెంచ్ ప్రెస్లో 60 కేజీలు, డెడ్లిఫ్ట్లో 125 కేజీలతో మొత్తం 292.5 కేజీలు ఎత్తి అగ్రస్థానంలో నిలిచింది. మధుర గతంలో 2024, 2025 జాతీయ ఛాంపియన్షిప్లలో, అలాగే చైనాలో జరిగిన ఆసియా ఛాంపియన్షిప్లో రజతం గెలుచుకుంది. ఇక సబ్-జూనియర్ 84+ కేజీల విభాగంలో పోటీపడిన ఆస్మా తాహెరాలీ జబువావాలా మొత్తం 372.5 కేజీల బరువు ఎత్తి ఆరో స్థానంలో నిలిచింది.
Also Read : అసదుద్దీన్ ఒవైసీపై సీఎం రేవంత్ పొగడ్తల వర్షం
Follow Us On : WhatsApp

