కలం, వెబ్ డెస్క్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ (BJP) సెక్రటేరియట్ను ముట్టడించింది. టీబీజేపీ చీఫ్ రామచందర్ రావు, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఇతర నేతలు సెక్రటేరియట్ ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణతోపాటు ఇతర నేతలను పోలీసులు అరెస్ట్ చేసి, గాంధీ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపుపై వినతిపత్రం అందజేసేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడం దుర్మార్గమని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో తల్లిదండ్రులు అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఫీజు బకాయిల కారణంగా కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో యువత నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించకపోతే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.

