కలం, మిర్యాలగూడ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేపడుతున్న మహాధర్నా నేపథ్యంలో మిర్యాలగూడ (Miryalaguda) పట్టణంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్ఎస్ (BRS) నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి పోటీగా కాంగ్రెస్ శ్రేణులు కౌంటర్ వ్యూహాన్ని అమలు చేయడంతో పట్టణంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ధర్నాకు కౌంటర్గా కాంగ్రెస్ శ్రేణులు మిర్యాలగూడ పట్టణంలో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాయి. ‘పదేళ్ల బీఆర్ఎస్ వైఫల్యాలు – 1000 రోజుల్లో కాంగ్రెస్ వికాసం’ అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నల్లగొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పించారు.
మరోవైపు కేటీఆర్ ధర్నాను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ శ్రేణులు ప్లకార్డులతో నిరసనకు సిద్ధమయ్యాయి. గురువారం ధర్నా రోజున నేరుగా నిరసనలు చేపట్టేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సమాయత్తమవుతున్నారు. ఇరు పార్టీలూ పోటాపోటీ కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో మిర్యాలగూడలో రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. బీఆర్ఎస్ మహాధర్నా, కాంగ్రెస్ కౌంటర్ నిరసనల నేపథ్యంలో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

