కలం, వెబ్డెస్క్: ఆకస్మిక వరదలతో తీవ్రంగా నష్టపోయిన నేపాల్ ప్రజలకు ప్రముఖ నటుడు సోనూసూద్ (Sonu Sood) అండగా నిలిచారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. నేడు సోనూసూద్ తన చారిటీ ఫౌండేషన్ బృందంతో కలిసి కాట్మాండుకు చేరుకున్నారు. క్షేత్రస్థాయిలో తిరుగుతూ స్థానికులతో మాట్లాడారు. వరదల్లో వేలాది మంది సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. వీరికి భారత్ నుంచి తీసుకెళ్లిన ఆహారం, మందులు, దుప్పట్లు, నిత్యావసరాలు పంపిణీ చేశారు.
నేపాల్లో పరిస్థితులు చక్కబడే వరకు భారత్ తరఫున సహాయం అందిస్తూనే ఉంటామని ప్రజలకు భరోసా ఇచ్చారు. సోనూ సూద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు, వారి పిల్లలతో మాట్లాడి కొంతసేపు వారితో గడిపారు. భారత్ నుంచి నేపాల్కు సహాయ సహకారాలు అందించడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, అయినా వారి బతుకులను గాడిలో పెట్టడం కోసం అన్ని సవాళ్లను ఎదురిస్తామని స్పష్టం చేశారు. ఇక సోనూసూద్ ఈ పరిస్థితుల్లో నేపాల్ వెళ్లి స్వయంగా సహాయ సహకారాలు అందించడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన గతంలో కోవిడ్ సమయంలో సైతం వేలాది మందిని ఆదుకున్న విషయం తెలిసిందే.
మరోవైపు నేపాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 900లకు పైగా మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. మరో 4000 మంది గల్లంతయ్యారు. ఇప్పటికీ వేలాది మంది ఆచూకీ తెలియడం లేదు. వీరిలో భారత్కు చెందిన వారు కూడా ఉన్నారు.

