కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్ సమీకృత కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం పెన్షన్ విద్రోహ దినోత్సవాన్ని నిర్వహించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన చేపట్టారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం (Old Pension Scheme)ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు డిమాండ్ చేశారు. ఉద్యోగుల భవిష్యత్తుతో పాటు పదవీ విరమణ అనంతర ఆర్థిక భద్రతకు పాత పెన్షన్ విధానం ఎంతో అవసరమని పేర్కొన్నారు. సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంటోందని, ప్రభుత్వం ఇకనైనా స్పందించి ఓపీఎస్ను పునరుద్ధరించాలని కోరారు. ఉద్యోగుల పెన్షన్ భద్రతకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

