కలం, వెబ్ డెస్క్: ప్రజలకు మేలు కలిగించేందుకే కూటమి పార్టీలు ఒక్కటైనట్లు సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ప్రజలకు భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రసంగించారు. ‘గత రెండేళ్ల కాలంలో కేవలం పింఛన్ల రూపంలోనే రూ.73 వేల కోట్లను అర్హులకు అందించాం. సంక్షేమ పథకాల కోసమే రూ.1.43 లక్షల కోట్లు మంజూరు చేశాం. కేంద్రం సహకారంతో పరిపాలనలో దూసుకుపోతున్నాం. ఆడబిడ్డలు కష్టపడొద్దని దీపం పథకంలో భాగంగా ఉచితంగా గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నాం. కూటమి ప్రభుత్వం పాలనలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం. రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తున్నాం’ అన్నారు.
350 కేసులు వేసినా..
మెగా డీఎస్సీ నిర్వహించి 16 వేల ఉద్యోగాలను పారదర్శకంగా అందించామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ పరీక్ష జరగొద్దని వైసీపీ 350 కేసులు వేస్తే.. కోర్టుల్లో కొట్లాడి అన్నింటినీ క్లియర్ చేసి మరీ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఎంతో ప్రతిభతో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను అవమానించేలా వైసీపీ వ్యవహరిస్తోందన్నారు. పెద్ద స్కాం జరిగిందంటూ అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తన సంకల్పాన్ని అడ్డుకోలేకపోయారని చంద్రబాబు తెలిపారు.

