కలం, వెబ్ డెస్క్: దేశ రాజధానిలో సైతం దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఢిల్లీలోని (Delhi) కశ్మీరీ గేట్ ప్రాంతంలో 16 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని మైన్పురికి చెందిన బాలిక పదకొండవ తరగతి చదువుతుంది. ఆగస్టు 4న రాత్రి కశ్మీరీ గేట్ ప్రాంతంలో నిలిపి ఉంచిన ఒక స్లీపర్ బస్సులో ఈ అఘాయిత్యం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటనపై బాధితురాలి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ కేసులో నేరానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బస్సు డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ అఘాయిత్యానికి ఉపయోగించిన స్లీపర్ బస్సును స్వాధీనం చేసుకున్నారు. దానిపై ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఢిల్లీ మరోసారి ఉలిక్కిపడింది.

