కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగులు (Revenue Employees) సమ్మెబాట పట్టారు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటుతో పాటు, పెండింగ్లో ఉన్న డీఏలు, మధ్యంతర భృతి (ఐఆర్) వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అనంతపురం జిల్లా సంయుక్త కలెక్టర్ (జేసీ) విష్ణు చరణ్కు సంఘం నేతలు అధికారికంగా ఉద్యమ నోటీసు అందజేశారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన జిల్లా అధ్యక్షుడు దివాకర్ రావు, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు రాజీలేని పోరాటం కొనసాగిస్తామన్నారు.
ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు దశలవారీగా ఆందోళనలను తీవ్రతరం చేస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు. ఇప్పటికే కాలయాపన ధోరణి అవలంబిస్తున్న అధికార యంత్రాంగానికి ఈ నోటీసు హెచ్చరిక లాంటిదన్నారు. సర్కార్ వెంటనే దిగివచ్చి చర్చలకు ఆహ్వానించాలని వారు డిమాండ్ చేశారు.

