కలం, వరంగల్ బ్యూరో: ములుగు (Mulugu) జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ నీటిలో పడి అన్నదమ్ములు మృతి చెందారు. మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన మాలోతు యాకూబ్, స్వాతి దంపతులు రాఖీ పండుగ కోసమని ఇద్దరు పిల్లలు వినయ్ కిశోర్ (16), రాజేశ్ (14)ను తీసుకుని ములుగు జిల్లా కేంద్రంలోని గణేష్లాల్పల్లికి వచ్చారు. ఆదివారం స్వాతి, యాకూబ్ కమలాపురం వెళ్లిపోగా.. రెండు రోజుల తర్వాత వస్తామని ఇద్దరు పిల్లలు చెప్పారు.
ఆదివారం అక్కడికి సమీపంలోని మొండికుంట వద్ద బహిర్భూమికి వెళ్లిన వినయ్ కిశోర్, రాజేశ్ ప్రమాదవశాత్తూ కుంటలో పడిపోయారు. మరో బాలుడు ఈ విషయాన్ని గుర్తించి వెంటనే స్థానికులకు చెప్పడంతో.. వారు వచ్చి చూసేసరికి అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు కుమారులు మరణించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు.

