కలం, స్పోర్ట్స్: జమ్మూ కశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ (Auqib Nabi)కి కీలక అవకాశం దక్కింది. ఇంగ్లండ్ కౌంటీ జట్టు సరీ తరఫున అతడు ఆడనున్నాడు. ఇంగ్లండ్ వీసా రావడంతో ఆదివారం న్యూఢిల్లీ నుంచి బయలుదేరే అవకాశం ఉంది. సెప్టెంబర్ 2 నుంచి యార్క్షైర్తో సరీ మ్యాచ్ ఆడనుంది. ది ఓవల్లో జరిగే ఈ మ్యాచ్లో నబీ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత సెప్టెంబర్ 8న ససెక్స్తో, సెప్టెంబర్ 15న గ్లామోర్గన్తో సరీ ఆడనుంది.
గత రంజీ ట్రోఫీలో నబీ అదరగొట్టాడు. 60 వికెట్లతో టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. అతడి ప్రదర్శనతో జమ్మూ కశ్మీర్ తొలిసారి రంజీ టైటిల్ గెలిచింది. ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్లో నబీ భారత జట్టులో ఉన్నాడు. అయితే రెండు మ్యాచ్ల్లోనూ ఆడే అవకాశం రాలేదు. ఇప్పుడు ఇంగ్లండ్లో ఆడటం ద్వారా సీమర్లకు అనుకూలమైన పరిస్థితుల్లో అనుభవం పొందనున్నాడు.
ఎర్ర కూకాబురా బంతితో బంతిని స్వింగ్ చేయగలడా? అనేది భారత జట్టు మేనేజ్మెంట్, సెలెక్టర్లు పరిశీలించనున్నారు. ఇది రాబోయే న్యూజిలాండ్ టెస్టు సిరీస్ను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయంగా తెలుస్తోంది. కౌంటీ మ్యాచ్లు పూర్తయ్యాక నబీ ఇండియా ‘A’ జట్టుతో కలిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 22 నుంచి పుదుచ్చేరిలో ఆస్ట్రేలియాతో రెండు రెడ్ బాల్ మ్యాచ్లు ఆడనుంది. మరోవైపు భారత పేసర్లు మహ్మద్ షమీ, ముఖేశ్ కుమార్ కూడా కౌంటీ క్రికెట్ ఆడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

