కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ నగరంలో అభివృద్ధి పనుల జోరు కొనసాగుతోంది. నగరంలోని 58వ డివిజన్ టవర్ సర్కిల్ వినాయక మందిరం ప్రాంతంతో పాటు పలు కాలనీల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar), మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ పరిశీలించారు. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (UIDF) నిధులు రూ.50 లక్షలతో చేపట్టిన ఎస్డబ్ల్యూజీ ఆర్సీసీ (SWG RCC) పైప్లైన్, సీసీ రోడ్డు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు, కాంట్రాక్టర్కు దిశానిర్దేశం చేశారు.
ప్రత్యేక పూజలతో పనుల పరిశీలన ప్రారంభం పనుల పరిశీలనకు ముందు నాయకులు డివిజన్లోని వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని సందర్శించారు. గణపతి భగవానుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి వేద మంత్రోచ్ఛరణలతో స్వాగతం పలికి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
నాణ్యతలో రాజీ పడొద్దు.. అధికారులకు ఆదేశం
అనంతరం పనులు జరుగుతున్న ప్రాంతాన్ని కలియతిరిగి పరిశీలించిన గంగుల కమలాకర్, వినోద్కుమార్.. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి కాలనీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మెన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ నాయకులు సోహన్ సింగ్, పలువురు డివిజన్ నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

