కలం, కరీంనగర్ బ్యూరో: డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అక్రమంగా మత్తు టాబ్లెట్లు విక్రయిస్తున్న (Illegal Drug Sales) ఆరోగ్య ఫార్మసీ మెడికల్ షాపును డ్రగ్ ఇన్స్పెక్టర్ సీజ్ చేయగా, షాపు యజమాని కొమ్మ రామును కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను కరీంనగర్ రూరల్ సీఐ ఏ. నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 28న కరీంనగర్ (Karimnagar) రూరల్ పోలీసులు డ్రగ్స్, హాష్ ఆయిల్, గంజాయితో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని విచారించారు.
ఇందులో నిందితుడైన జగిత్యాల జిల్లాకు చెందిన నితిన్, కరీంనగర్లోని బ్యాంక్లైన్ సమీపంలో ఉన్న ఆరోగ్య ఫార్మసీ యజమాని కొమ్మ రాము వద్ద డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ‘టపాల్-50’ తదితర మత్తు టాబ్లెట్లను అధిక ధరలకు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఆ టాబ్లెట్లను నీటిలో కరిగించి సిరింజీల ద్వారా నరాల్లోకి ఎక్కించుకుని మత్తుకు అలవాటు పడినట్లు తేలడంతో ఆ తొమ్మిది మందిని పోలీసులు ఇప్పటికే జైలుకు పంపారు.
నిందితుల వాంగ్మూలం ఆధారంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రావణ్ కుమార్ ఆగస్టు 29న సదరు మెడికల్ షాపులో తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించడం(Illegal Drug Sales), రిజిస్టర్లలో సరిగా వివరాలు నమోదు చేయకపోవడాన్ని గుర్తించి షాపును సీజ్ చేశారు.
అనంతరం ఆగస్టు 30వ తేదీన ఉదయం మెడికల్ షాపు యజమాని కొమ్మ రామును అదుపులోకి తీసుకుని పంచుల సమక్షంలో విచారించగా.. సులభంగా డబ్బు సంపాదించేందుకు ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్లు విక్రయించినట్లు అంగీకరించాడు. దీంతో రాముపై అరెస్ట్ మెమో జారీ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న టాబ్లెట్లు, సిరింజీలను డ్రగ్ ఇన్స్పెక్టర్కు పంపించి నివేదిక కోరామని, ఆ నివేదిక ఆధారంగా కోర్టులో చార్జిషీట్ దాఖలు చేస్తామని సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.
Also Read : ప్రశ్నించడం విద్యార్థుల రాజ్యాంగ హక్కు: ఉజ్జల్ భుయాన్
Follow Us On: X(Twitter)

