కలం, స్పోర్ట్స్: లార్డ్స్లో పాకిస్థాన్ మరోసారి బ్యాటింగ్లో కుప్పకూలడంపై కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ (Sarfaraz Ahmed) స్పందించారు. బ్యాటర్ల వైఫల్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు టెస్టుల్లోనూ బ్యాటింగ్ ఆశించిన స్థాయిలో లేదని చెప్పారు. ఇంగ్లండ్ పరిస్థితుల్లో తమ బ్యాటింగ్ కూర్పు సరైన ఫలితాలు ఇవ్వలేకపోయిందని పేర్కొన్నారు. బ్యాటర్లు క్రీజులో ఎక్కువసేపు నిలవలేకపోతున్నారని సర్ఫరాజ్ అన్నారు. తొలి 30 నుంచి 40 బంతులు చాలా కష్టంగా ఉంటాయని చెప్పారు. ఆ దశను దాటితే బ్యాటింగ్ కొంత సులభమవుతుందని వివరించారు.
దెబ్బతీసిన ఇంగ్లాండ్ పేసర్..
రెండో టెస్టు రెండో రోజు ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో కేవలం 110 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ పేసర్ ఒల్లీ రాబిన్సన్ 13 ఓవర్లలో 11 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 290 పరుగులు చేసింది. దీంతో పాకిస్థాన్ 180 పరుగుల వెనుకబడింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయింది. వెలుతురు సరిగా లేకపోవడంతో రెండో రోజు ఆట ముందుగానే ముగిసింది.
పాకిస్థాన్ పుంజుకునే అవకాశం..
పాకిస్థాన్ తరఫున అజాన్ అవైస్ అత్యధికంగా 46 పరుగులు చేశాడు. ఎనిమిది పరుగుల వద్ద అతడికి స్లిప్స్లో క్యాచ్ జారింది. సౌద్ షకీల్ 16 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లలో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. అయితే మ్యాచ్లో ఇంకా అవకాశం ఉందని సర్ఫరాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంగ్లండ్ను మరో 70 నుంచి 80 పరుగుల్లోపు ఆలౌట్ చేసి, 300 నుంచి 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తే పాకిస్థాన్కు అవకాశం ఉంటుందని తెలిపారు. మూడు టెస్టుల సిరీస్లో పాకిస్థాన్ ఇప్పటికే తొలి మ్యాచ్ను ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో కోల్పోయింది. లార్డ్స్లోనూ ఆ జట్టు భారీ వెనుకంజలో ఉంది.

