కలం, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు (Manuguru )ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘తెలుగు భాషా దినోత్సవ’ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా, ఉత్సాహభరిత వాతావరణంలో మిన్నంటాయి. తెలుగు విభాగం ఆధ్వర్యంలో వ్యావహారిక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకొని ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ యార్నం చిన్నప్పయ్య మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ అమ్మభాషను ప్రేమించాలని, విద్యార్థులు తెలుగు భాషపై పూర్తి పట్టు సాధించడమే కాకుండా అక్షర దోషాలు లేకుండా రాయడం నేర్చుకోవాలని సూచించారు. సమాజంలో మాతృభాష ప్రాముఖ్యతను వివరిస్తూ, గిడుగు రామ్మూర్తి పంతులు తెలుగు భాషా వికాసానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగు విభాగ అధ్యాపకులు డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ పొక్కిలి భాస్కరరావు, డాక్టర్ సాంబమూర్తి, బూర్గుల సతీష్ తో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

