కలం, హనుమకొండ: హనుమకొండను (Hanumakonda) ప్రధాన క్రీడా కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి (Naini Rajender Reddy) తెలిపారు. జేఎన్ఎస్ ఇండోర్ స్టేడియంలో పునర్నిర్మించిన బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ను శనివారం ఎంపీ డాక్టర్ కడియం కావ్య, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి (Naini Rajender Reddy) మాట్లాడుతూ.. క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో జేఎన్ఎస్లో క్రీడా వసతులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అందుబాటులోకి వచ్చిన సౌకర్యాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. స్పోర్ట్స్ స్కూల్కు సొంత భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. హనుమకొండలో క్రీడా రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రతిభావంతులైన క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సాహం, మౌలిక వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు.
కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ (Collector Chahat Bajpai) మాట్లాడుతూ.. జేఎన్ఎస్లో క్రీడా వసతులను మెరుగైన ప్రమాణాలతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన సదుపాయాలను క్రీడాకారులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. అదే సమయంలో క్రీడా సౌకర్యాలను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. స్పోర్ట్స్ స్కూల్కు ప్రత్యేక భవనం నిర్మించేందుకు ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక సమర్పించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కొత్త ప్రశాంత్ మాట్లాడుతూ.. దాదాపు రూ.1.50 కోట్ల వ్యయంతో బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ పునర్నిర్మాణ పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Also Read : నకిరేకల్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: Instagram

