కలం, జోగులాంబ గద్వాల: కేటిదొడ్డి (KT Doddi) మండలంలో రాఖీ పౌర్ణమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు పరస్పరం రాఖీలు కట్టుకుని ప్రేమానురాగాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా కేటిదొడ్డి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎస్సై పి.శ్రీనివాసులు ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
తోబుట్టువుల మధ్య ఆప్యాయత, ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగను స్టేషన్ అధికారులు, సిబ్బంది ఒకే కుటుంబ సభ్యుల్లా ఉత్సాహంగా జరుపుకున్నారు. స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ ధానేశ్వరీ ఎస్ఐ పి.శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్ కృష్ణుడు, సిబ్బందికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్ఐ పి.శ్రీనివాసులు మాట్లాడుతూ, రాఖీ పండుగ సోదర–సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, రక్షణకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యుల మాదిరిగా ఐకమత్యంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.

