కలం, జగిత్యాల: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రధానమైన ఆయుధమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) అన్నారు. , ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామంలో గురువారం ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే సంజయ్ పాల్గొని మాట్లాడారు. నూతన ఓటర్ల నమోదుకు ఫారం–6, ఓటరు జాబితాలో మార్పులు, సవరణలకు ఫారం–8, అభ్యంతరాలు, తొలగింపులకు ఫారం–7 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
మళ్లీ ఓటరుగా నమోదు చేసుకునేలా..
ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ.. జగిత్యాల నియోజకవర్గంలో సుమారు 81 వేల ఓట్లు నమోదు కాలేదని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు బాధ్యత తీసుకుని ఓటరు మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఓటరు జాబితాలో తమ పేరు లేకపోతే ప్రజలు సంబంధిత ధ్రువపత్రాలను బూత్ స్థాయి అధికారులకు (బీఎల్ఓలకు) అందజేసి ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజంగి నందయ్య శ్రీనివాస్, ఆర్డీవో మధుసూదన్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, మండల రెవెన్యూ అధికారి రామ్మోహన్, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ దామోదర్ రావు, ఉప సర్పంచి బాలే శ్రీనివాస్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ ప్రభాకర్, మాజీ ఉప సర్పంచ్ మహేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరేష్, నాయకులు, పాల్గొన్నారు.

