కలం, నిర్మల్: దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఉద్యోగులు సమరభేరి మోగించారు. నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) ఆధ్వర్యంలో గురువారం మహాధర్నాకు దిగింది. ఈ సందర్భంగా ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ నిరసన తెలిపారు. అనంతరం జిల్లా చైర్మన్ ప్రభాకర్ మాట్లాడారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని వేచి చూశామన్నారు. అయినప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోవడంతోనే మహాధర్నా చేపట్టాల్సి వచ్చిందన్నారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు వెంటనే రెండో పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న ఆరు డీఏలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2004 నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులకు అమలు చేస్తున్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని కోరారు. ప్రభుత్వం ప్రధాన డిమాండ్లను పరిష్కరించే వరకు దశలవారీగా పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన తేల్చి చెప్పారు.

