కలం, మహబూబ్నగర్ బ్యూరో: ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సంబంధించిన గుడిసెల జాబితాను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి వెంటనే సమర్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ (Additional Collector Madhusudan Naik) సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కార్యాలయం నుంచి వెబెక్స్ ద్వారా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ), డివిజనల్ ఇంజినీర్లు (డీఈలు), అసిస్టెంట్ ఇంజినీర్లతో మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లా ప్రాతిపదికన ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, గుడిసెల జాబితా సమర్పణపై సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ మండలాల నుంచి అందిన స్థితిగతుల నివేదికలను (స్టేటస్ రిపోర్టులు) పరిశీలించినట్లు తెలిపారు. ఇప్పటివరకు గుడిసెల జాబితాను సమర్పించని మండలాల అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న సమాచారాన్ని ఎలాంటి ఆలస్యం లేకుండా తక్షణమే జిల్లా కార్యాలయానికి సమర్పించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంపై అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే శాఖాపరమైన తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల మంజూరు ప్రక్రియలో అవసరమైన సమాచారాన్ని పక్కాగా సేకరించి నిర్ణీత గడువులోగా నివేదించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ ఉపేందర్ రెడ్డి, డీఈలు, ఏఈలు, ఇతర ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Also Read : వాళ్లే టార్గెట్.. వెలుగులోకి హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్
Follow Us On: X(Twitter)

