కలం, నిర్మల్ : చైన్ స్నాచింగ్, మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను (Chain Snatching Gang) నిర్మల్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో డీఎస్పీ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన హరి ప్రకాష్ అలియాస్ కిషన్ త్యాగి, సంజీవ్ అలియాస్ ఖాలు, మోహన్ కలిసి ముఠాగా ఏర్పడి తెలంగాణలో చైన్ స్నాచింగ్, మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
ఇటీవల నిర్మల్ లో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనపై జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Sharmila Janaki) ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలతో హరి ప్రకాష్, సంజీవ్ లను పోలీసులు అరెస్టు చేయగా, మరో నిందితుడు మోహన్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులను విచారించగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు చైన్ స్నాచింగ్ లు, ఒక మోటార్ సైకిల్ దొంగతనం, చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో మరో చైన్ స్నాచింగ్ కు పాల్పడినట్లు గుర్తించామని తెలిపారు. వారి (Chain Snatching Gang) వద్ద నుంచి ద్విచక్ర వాహనం, మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని డీఎస్పీ సూచించారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ సమ్మయ్య పాల్గొన్నారు.
Also Read : వాళ్లే టార్గెట్.. వెలుగులోకి హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్
Follow Us On: X(Twitter)

